ఏపీలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో 2024 పేరుతో టీడీపీ, బీజేపీ , జనసేన కూటమి మేనిఫెస్టో తీసుకువచ్చాయి. అయితే మేనిఫెస్టో కాపీ మీద ఎక్కడా ప్రధాని మోదీ, బీజేపీ గుర్తు లేకపోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ఫోటోలతోనే మేనిఫెస్టో కాపీలను ముద్రించారు. అలాగే ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటుగా.. బీజేపీ నేత సిద్ధార్థ్ సింగ్ పాల్గొన్నారు. అయితే మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో సిద్ధార్థ్ సింగ్ అంటీముట్టనట్లుగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. మేనిఫెస్టో కాపీని అందిస్తున్న సమయంలోనూ ఆయన చేతికి తీసుకోవడానికి ఇష్టపడకపోవటం వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉందని.. మేనిఫెస్టో మీద మోదీ, బీజేపీ ఫోటోలు వద్దని చెప్పిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మేనిఫెస్టో మీద మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, పురంధేశ్వరి ఫోటోలు లేకుండానే ముద్రించారని చెప్తున్నారు. మరోవైపు ముందు నుంచి కూడా ఉచిత పథకాలకు బీజేపీ వ్యతిరేకం. కర్ణాటక సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అంటూ ఉచిత పథకాలు ప్రకటించినప్పటికీ బీజేపీ వాటి జోలికి పోలేదు. ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఉచిత హామీలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలోని కూటమి మేనిఫెస్టోకు దూరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ ఇచ్చిన హామీల్లో ఎక్కువగా ఉచితపథకాలు ఉండటంతోనే ఆ పార్టీ దూరంగా ఉందంటూ ప్రచారం నడుస్తోంది.
అయితే మేనిఫెస్టోపై బీజేపీ బొమ్మ లేకపోవటంపై చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఈ మేనిఫెస్టో టీడీపీ, జనసేనదే అని చంద్రబాబు చెప్పారు. టీడీపీ జనసేన పార్టీలే ఈ మేనిఫెస్టోను రూపొందించాయని వెల్లడించారు. టీడీపీ జనసేన కలిసి మేనిఫెస్టోపై కసరత్తు చేశాయని, బీజేపీ సలహాలు తీసుకున్నామని తెలిపారు.జాతీయ పార్టీ అయిన బీజేపీ జాతీయ స్థాయిలోనే మేనిఫెస్టో ఇచ్చిందని, ప్రత్యేకంగా రాష్ట్రస్థాయిలో మేనిఫెస్టో ఉండదని చెప్పారు. అయితే కూటమి మేనిఫెస్టో అమలు చేసేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.