ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో మహిళా ఓటర్లే లక్ష్యంగా కీలక హామీలు ప్రకటించారు. మహిళలకు ఉచితబస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు ప్రకటించారు.
అయితే హామీల ప్రకటనలో టీడీపీ కూటమి.. కాంగ్రెస్ పార్టీని అనుసరించినట్లు కనిపించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్లు, మహిళల అకౌంట్లోకి ప్రతి నెలా 2500 నగదు వంటి హామీలు ఇచ్చింది. వీటిలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, ఐదొందలకే గ్యాస్ సిలిండర్లు పథకాలను అమలు చేస్తోంది. అయితే కర్ణాటకలో సక్సెస్ అయిన ఈ ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అనుసరించి అధికారాన్ని కైవసం చేసుకుంది.ఈ క్రమంలోనే టీడీపీ కూటమి కూడా ఇదే బాటలో మహిళలను ఆకర్షి్ంచేందుకు పలు హామీలు ఇచ్చింది. అందులో ప్రధానంగా..
ఏపీలోనూ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం పేరిట తెలంగాణలో ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉంది. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ సిటీ బస్సుల్లో అమలు చేస్తున్నారు. ఈ విధానం కింద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో టికెట్లు ఇస్తున్నారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు అందజేయనుంది.
తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికీ రూ.15వేలు
‘తల్లికి వందనం’ పథకం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఏటా ఒక్కొక్కరికి 15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమచేస్తామని చంద్రబాబు మ్యానిఫెస్టోలో ప్రకటించారు. వైసీపీ ఇప్పటికే అమ్మఒడి పేరిట ఈ తరహా పథకాన్ని అమలు చేస్తుండగా.. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ పథకాన్ని అమలు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది.
దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం
టీడీపీ మేనిఫెస్టోలోని మరో ముఖ్యమైన పథకం ప్రతి ఇంటికి ఉచితంగా మూడు సిలిండర్లు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏటా ఉచితంగా మూడు వంటగ్యాస్ సిలిండర్లను అందిస్తామని టీడీపీ కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. తెలంగాణలోనూ ఇదే తరహా పథకం అమల్లో ఉంది. తెలంగాణలో రూ.500 లకే గ్యాస్ సిలిండర్లు అందిస్తుండగా.. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే పూర్తి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500
మరోవైపు ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున అందిస్తామని టీడీపీ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ప్రతి నెలా రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. వీటితోపాటుగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు.