ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ భారీగా డబ్బులు, బంగారం, వెండి వస్తువులు పట్టుబడుతున్నాయి. తాజాగా వందేభారత్ రైలులో డబ్బులు తీసుకెళుతూ అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వందేభారత్ రైలులో తరలిస్తున్న రూ.50 లక్షల నగదును ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. దాన్ని జీఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించగా, వారి నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుమార్, పవన్ అనే ఇద్దరు వ్యక్తులు డబ్బుల్ని తరలిస్తున్నారు. వీరిలో ఒకరు హైదరాబాద్కు చెందిన వ్యక్తికాగా, మరొకరు నెల్లూరులో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. ఎలాంటి రశీదులు లేకుండా డబ్బులు తీసుకెళుతుండటంతో డబ్బులు సీజ్ చేశారు.
మరోవైపు విశాఖపట్నానికి చెందిన కలిదిండి వెంకటేశ్వర రాజు కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం ఏసీ బస్సులో ఓ బ్యాగుతో ప్రయాణిస్తున్నాడు. శ్రీకాకుళం సింహద్వారం వద్ద సర్వేలైన్స్ అధికారులు బస్సును ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో వెంకటేశ్వరరాజు బ్యాగులో రూ.29.50లక్షల నగదు దొరికింది. దీనిపై వెంకటేశ్వరరాజును వివరణ కోరగా మెళియాపుట్టిలో ఏకలవ్య స్కూల్ నిర్మాణానికి ఈ నగదు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఆ డబ్బుల్ని సీజ్ చేసి ట్రెజరీకి అప్పగించారు. ఉల్లివలస చెక్పోస్టు దగ్గర ఎటువంటి ఆధారాలు లేని నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం చీపురుపల్లి నుంచి రాజాం వైపు ఎలక్రికల్ స్కూటీపై వస్తు న్న నూరు జయరాంను తనిఖీ చేయగా అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేని రూ.75 వేల 500 స్వాధీనం చేసుకున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం చెక్పోస్టు దగ్గర వాహనాలు తనిఖీ చేశారు. విజయవాడ నుంచి అమలాపురం వెళ్తున్న బీవీసీ లాజిస్టిక్ వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో రూ.6,70,16,362 విలువైన 9.530కిలోల బంగారు ఆభరణాలు, 18.71గ్రాముల వెండి వస్తువులను గుర్తించారు. సరైన బిల్లులు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు.