తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మంగళవారం నారా లోకేష్ ఒంగోలు జిల్లాకు వస్తున్నారు. వేర్వేరు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువతను చైతన్యవంతం చేసే లక్ష్యంతో ఈనెల 30నుంచి వారం రోజులపాటు లోకేష్ యువగళం తరహాలో మరోకార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ పరిధిలో తొలిసారి ఓటు హక్కు పొందిన విద్యార్థులు, యువకులతో ముఖాముఖికి ఆయన సిద్ధమయ్యారు. యువతను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా లోకేష్ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఒంగోలు నుంచి ప్రారంభిస్తున్నారు. నగరంలోని గుంటూరు రోడ్డులో మంగళవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఇది జరగనుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు టీడీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ నేతృత్వంలో జరుగుతున్నాయి. సదస్సు అనంతరం లోకేష్ నెల్లూరు వెళ్లనున్నారు.