దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నటీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఇలాంటి ఘటన జరగడం ఎంతో సిగ్గుచేటు అని పేర్కొన్నారు. శంషాబాద్లో ప్రియాంక రెడ్డిని ఇద్దరు లారీ డ్రైవర్తో పాటు మరో ఇద్దరు క్లీనర్లు సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. ప్రియాంక రెడ్డి మరణం యావత్ దేశాన్నే కుదిపేసింది. నిర్భయ ఘటన తర్వాత మళ్లీ అంత దారుణమైన ఘటన ఇదేనని అంటున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పాశవిక అత్యాచారాన్ని ఖండిస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా తన బాధని వ్యక్తకరించారు. 'హైదరాబాద్లో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. సమాజంలో మనం అందరం బాధ్యత తీసుకుని ఇలాంటి అవమానవీయ ఘటనలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది' అని కోహ్లీ ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ ఘటనను ఖండించారు.