వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్కు చేదు అనుభవం ఎదురైంది. కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ విమానంలో ఎక్కడానికి అనుమతించనందుకు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్పై క్రిస్ గేల్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డాడు. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ తనతో ప్రవర్తించిన తీరుకు తాను నిరాశ చెందానని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డాడు. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్పై తన అసహనాన్ని ట్విట్టర్ వేదికగా ప్రదర్శించాడు. ఈ మేరకు క్రిస్ గేల్ తన ట్విట్టర్లో "ఎమిరేట్స్ నా పట్ల ప్రవర్తించిన తీరుకు నిరాశచెందా. నా వద్ద కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ.. బుక్ అయిపోయిందని చెప్పారు. WTF! అంతే కాదు, నేను బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే ఎకానమీ క్లాస్లో ప్రయాణించమంటున్నారు. దీంతో నేను ఆ తర్వాతి విమానంలో ప్రయాణించవలసి ఉంది! ఎమిరేట్స్తో చెత్త అనుభవం" అంటూ ట్వీట్ చేశాడు. క్రిస్ గేల్ ట్వీట్కు ఎమిరేట్స్ ఎయిర్లైన్ సైతం ట్విట్టర్లో స్పందించడం విశేషం. తన ట్విట్టర్లో "మమ్మల్ని క్షమించండి, క్రిస్. దయచేసి మీ బుకింగ్ రిఫరెన్స్ మరియు ఇమెయిల్ చిరునామాను మాకు DMకు తెలియజేయండి. ఆప్షన్స్ను చెక్ చేసి మీకు తెలియజేస్తాము" అని ట్వీట్ చేసింది. క్రిస్ గేల్ చివరిసారిగా ఈ ఏడాది ఆగస్టులో భారత్తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లో కనిపించాడు. ఈ మ్యాచ్లో 42 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించడంతో వెస్టిండిస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాగా, 301 మ్యాచ్లాడి 10,480 పరుగులతో వన్డేల్లో వెస్టిండిస్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. 1999లో టొరంటో వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో అంతర్జాతీయ వన్డేలో అడుగుపెట్టిన క్రిస్ గేల్ వన్డేల్లో 25 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలు చేశాడు. నవంబర్ 6 నుంచి ఆప్ఘనిస్థాన్తో వెస్టిండీస్ జట్టు మూడు వన్డేలు, టీ20 సిరిస్లో పాల్గొనుంది. ఈ సిరిస్లో భాగంగా అన్ని మ్యాచ్లు లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు సూచన మేరకు లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియాన్ని బీసీసీఐ ఆప్ఘన్కు కేటాయించిన సంగతి తెలిసిందే.