ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి.. కీలక నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 10:08 PM

హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాయి. ఇబ్రహీం రైసీ మృతి పట్ల వివిధ దేశాల అధినేతలు స్పందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇబ్రహీం రైసీ మరణంతో ఆయన గౌరవార్థం భారత్‌లో సంతాప దినం పాటించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మంగళవారం దేశవ్యాప్తంగా సంతాప దినం పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


మే 21 వ తేదీన భారత్‌లో ఒక రోజు సంతాప దినం పాటించాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇరాన్‌కు భారత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఇలా చేయడం తొలిసారి ఏమీ కాదు. గతంలో ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన సమయంలో కూడా భారత్ సంతాప దినాలు ప్రకటించింది. 1989 లో ఇరాన్‌ తొలి సుప్రీం లీడర్‌ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించారు. ఆ సమయంలో భారత్‌లో మూడు రోజులపాటు సంతాప దినాలు పాటించారు.


ఇక అంతకుముందే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయిన విషయం తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇబ్రహీం రైసీ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్, ఇరాన్ రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం చేయడానికి ఇబ్రహీం రైసీ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని గుర్తు చేసుకున్నారు. ఇబ్రహీం రైసీ మృతితో ఆయన కుటుంబసభ్యులకు, ఇరాన్ దేశ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్విటర్ వేదికగా ప్రధానమంత్రి మోదీ స్పందించారు.


ఇక ఈ హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇబ్రహీం రైసీతోపాటు ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీరబొల్లహియన్‌, తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్సు గవర్నర్ మలేక్‌ రహ్‌మతీ సహా పలువురు చనిపోయారు. ఇక ఇబ్రహీం రైసీ మృతితో ఇరాన్‌కు తాత్కాలిక అధ్యక్షుడిని నియమించారు. ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌ నియామకానికి సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ఆమోదం తెలిపారు. ఇక ఇబ్రహీం రైసీ మృతితో ఇరాన్‌లో 5 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com