ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. శ్రీవారి నుంచి భారీగా కానుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 10:01 PM

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గరుడసేవ నిర్వహించారు. గరుడసేవ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం గరుడవాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు, గరుడ వాహనంపై నాలుగు మాడవీధులలో విహరించిన స్వామివారిని చూసి భక్తులు ఆనందపరవశులయ్యారు. మరోవైపు గరుడసేవ సందర్భంగా.. ఏనుగులు, గుర్రాలు,నృత్య బృందాలు, కోలాటాలు, కళాకారుల ప్రదర్శనలు ఊరేగింపును మరింతగా వేడుకగా మార్చేశాయి. మరోవైపు గోవిందరాజస్వామి గరుడ వాహన సేవను తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.


మరోవైపు గోవిందరాజస్వామి గరుడసేవను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి కానుకగా రూ.10 లక్షల విలువైన ఆభరణాలు సమర్పించారు. తన సోదరుడు అయిన గోవిందరాజునికి తిరుమల శ్రీవారు పది లక్షలు విలువచేసే.. మూడు ఆభరణాలు, వజ్రపు పోగులు, లక్ష్మి కాసు మాల, తెల్ల రాళ్ల పతకాన్ని బహుకరించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.


మరోవైపు తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో మే 22న నృసింహ జయంతి నిర్వహించనున్నారు. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ యోగ నరసింహస్వామి మూల‌మూర్తికి ప్రత్యేక అభిషేకం చేస్తారు. అనంతరం వసంత మండపంలో శ్రీ నరసింహస్వామి పూజ నిర్వహిస్తారు. మే 23వ తేదీ వైశాఖ పౌర్ణమి గరుడసేవను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతినెలా పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తారు. అందులో భాగంగారాత్రి 7 నుంచి 9 గంటల వరకూ మలయప్పస్వామి గరుడ వాహనం మీద మాడవీధులలో విహరిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com