ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లూరి జిల్లాలో విషాదం..మంచంపై నుంచి పడి వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 08:44 PM

మరణం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఊహించడం చాలా కష్టం. ఒకవేళ దాన్నుంచి తప్పించుకుందామని చూసినా.. భూమ్మీద మనం టైమ్ ముగిసిపోయినప్పుడు మృత్యుదేవత ఒడిలోకి జారుకోవాల్సిందే. అంతెందుకు దుర్యోధనుడు అంతటి వాడు కూడా.. పాండవుల ధాటికి భయపడిపోయి మడుగు అడుగున దాక్కుని ఉండిపోయాడు. కానీ.. విధిరాతను తప్పించుకోలేకపోయాడు. తనువు చాలించాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఓ ఘటన గురించి వింటే అయ్యోపాపం అనిపించడంతో పాటుగా కాస్త ఆశ్చర్యం కూడా కలగకుండా ఉండదు.


నిద్రిస్తున్న సమయంలో మంచంపై నుంచి పడి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన అల్లూరి సీతారామరాజుజిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బౌడ గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి ఆదివారం రాత్రి మంచంపై నుంచి కిందకుపడ్డారు. దీంతో అతని తలకు తీవ్రగాయమైంది. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శ్రీను సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. మెదడులో రక్తం గడ్డకట్టడంతోనే శ్రీను చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసిన స్థానికులు.. అయ్యో పాపం అంటూ దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుకోని విధంగా కుటుంబపెద్ద చనిపోవటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


మరోవైపు మంచంపై నుంచి పడి పసిపిల్లలు, చిన్నారులు చనిపోయిన ఘటనలు గతంలోనూ జరిగాయి. అయితే కిందపడిన సమయంలో తలకు తీవ్రగాయమైతే ఇబ్బందేనని వైద్యులు చెప్తున్నారు. నిద్రపోయే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చిన్నారులతో పాటుగా పెద్దవాళ్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తాజా ఘటన రుజువుచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com