ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తనపై ఉన్న అతిపెద్ద ఆరోపణ ఏంటో వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 10:07 PM

నరేంద్ర మోదీ. కొన్ని దశాబ్దాలుగా దేశరాజకీయాల్లో వినిపిస్తున్న పేరు. అయితే రాజకీయ నాయకులపై ఆరోపణలు కొత్తేమీ కాదు. చిన్న స్థాయి గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు ఏదో ఒక సందర్భంలో వారిపై ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అయితే అవి ప్రధాని పీఠం ఎక్కినప్పటినుంచే కాకుండా అంతకుముందు నుంచి కూడా ఉన్నాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు దాదాపు 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పని చేశారు. ఆ సమయంలో కూడా ప్రతిపక్షాలు ఆయనపై ఎన్నో ఆరోపణలు చేసేవి. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా.


దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు తన రాజకీయ జీవితంలో వచ్చిన అతిపెద్ద ఆరోపణ ఏంటి అనేది వెల్లడించారు. అయితే అది ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాలేదని.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వచ్చిందని స్పష్టం చేశారు. తనకు 250 జతల బట్టలు ఉన్నాయనే ఆరోపణే తనపై ఇప్పటిదాకా వచ్చిన ఆరోపణల్లో అతి పెద్దది అని తాజా ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ వెల్లడించారు.


అయితే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత అమర్‌సిన్హ్ చౌదరీ.. తనపై విమర్శలు చేస్తూ ఓ బహిరంగ సభలో ఈ ఆరోపణలు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇక ఆ ఆరోపణలను తాను తిప్పికొట్టినట్లు మోదీ చెప్పారు. "మీకు రూ.250 కోట్లు దోచుకున్న ముఖ్యమంత్రి కావాలా.. లేక 250 జతల బట్టలు ఉన్న ముఖ్యమంత్రి కావాలా అని తాను గుజరాత్ ప్రజలను అడిగాను. దాంతో 250 జతల బట్టలు ఉన్న ముఖ్యమంత్రే తమకు కావాలని గుజరాత్ ఓటర్లు ముక్త కంఠంతో చెప్పారు" అని ప్రధాని మోదీ తాజాగా వెల్లడించారు.


ఈ క్రమంలోనే తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనను మోదీ గుర్తు చేసుకున్నారు. ఒక బహిరంగ సభలో అమర్‌సిన్హ్ చౌదరి ఆరోపణలను తాను అంగీకరించానని, అయితే మాజీ ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న దుస్తుల సంఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అదే రోజు తాను నిర్వహించిన బహిరంగ సభలో ఆ ఆరోపణలను స్వీకరించానని.. అయితే ఆయన చెప్పిన 250 సంఖ్యలో సున్నా గానీ, 2 గానీ తప్పు అని స్పష్టం చేశారు. ఇప్పటికీ తను ఆ ఆరోపణలను అంగీకరిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com