ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.100తో అపరిమిత ప్రయాణం.. మెట్రో బంపరాఫర్

national |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 10:25 PM

దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడంతో గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుని, ప్రయాణించే కష్టాలు కొంత మేర తగ్గాయి. ప్రయాణికులను మరింత ఎక్కువగా ఆకట్టుకోడానికి పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా, చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ కూడా ఇలాంటి వినూత్న ఆఫర్ తీసుకొచ్చింది. పర్యాటకులు, వారాంతాల్లో షాపింగ్‌లకు వెళ్లాలనుకునే వారికోసం ‘వన్‌ డే టూరిస్ట్‌ కార్డ్‌’పేరుతో కొత్త పథకానికి శనివారం శ్రీకారం చుట్టింది. రూ.100లతో వారాంతపు రోజుల్లో ఎన్నిసార్లయినా తిరిగే ప్రయాణించే వీలుంటుందని తెలిపింది.


ఈ కార్డుకు రూ.150 చెల్లిస్తే.. ఇందులో రూ.50 డిపాజిట్‌గా తీసుకుంటారు. మళ్లీ కార్డును ఇచ్చేటప్పుడు డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లిస్తారని పేర్కొంది. మార్చితో పోల్చితే చెన్నై మెట్రోలో ప్రయాణికుల సంఖ్య తగ్గింది. మార్చిలో 86.82 లక్షలు, ఏప్రిల్లో 80.87 లక్షల మంది ప్రయాణించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు కొత్త పథకాన్ని సీఎంఆర్‌ఎల్‌ ప్రవేశపెట్టింది. చెన్నై సిటీ పరిధిలోని కోయంబేడు, విమానాశ్రయం వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. రద్దీ సమయాల్లో వాహనాలు అంగుళం అంగుళం కదులుతాయి. మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మందికి ట్రాపిక్ కష్టాలు తప్పాయి.


ఈ నేపథ్యంలో రెండో దశ ప్రాజెక్టు విస్తరణను చెన్నై మెట్రో వేగంగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన పనులు కీలక దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం విమానాశ్రయం నుంచి విమ్‌కో నగర్‌, పరంగిమలై నుంచి సెంట్రల్‌ వరకు 54 కిలోమీటర్ల మేర 2 మార్గాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లలో రోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మాధవరం - చోషింగనల్లూరు, మాధవరం - సిరుచ్చేరి చిప్‌గట్‌, పూంతమల్లి - లైట్‌హౌస్‌ వరకు 116 కిలోమీటర్ల మేర రూ.63,246 కోట్లతో మెట్రో రెండో దశ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 119 మెట్రో స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com