రైతుల రుణ మాఫీ వ్యవహారంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోందని అన్నారు. రుణాల వసూలు కోసం రైతుల వద్దకు ఎవరు వచ్చినా వారిపై విరుచుకుపడండంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 'కిసాన్ ఆక్రోష్ ఆందోళన్' కార్యక్రమంలో రేవా ఎంపీ మిశ్రా మాట్లాడుతూ, రైతుల నుంచి రుణాలు వసూలు చేసేందుకు పోలీసులు వస్తే వారి గొంతు పట్టుకోండని, చేతులు విరగ్గొట్టండని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ వాళ్లు కానీ, పోలీసులు కానీ దురుద్దేశాలతో రైతుల దగ్గరకు వస్తే వాళ్ల చేతులు విరగ్గొట్టండి. పీక నులిమేయండి. బీజేపీ కార్యకర్తలు రైతులకు గట్టి అండగా నిలబడతారు అని మిశ్రా అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విభజన, విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతోందని కూడా ఆయన ఆరోపించారు. అయితే కాంగ్రెస్ విధ్వంసకర రాజకీయాలను తాము ఏమాత్రం సహించి ఊరుకునేది లేదని హెచ్చరించారు.