ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత పౌరసత్వం వచ్చాక తొలిసారి ఓటు వేసిన అక్షయ్ కుమార్.. ఏమన్నారంటే?

national |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 10:13 PM

అక్షయ్ కుమార్. పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌లో విభిన్న రకాల సినిమాల్లో నటించి.. దేశంలోనే ఎంతో పాపులర్ అయ్యారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఓటు వేసిన అక్షయ్ కుమార్.. కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే భారత పౌరసత్వం వచ్చిన తర్వాత ఆయన తొలిసారి ఓటు వేయడం గమనార్హం. గతంలో అక్షయ్ కుమార్‌కు కెనడా పౌరసత్వం ఉండగా.. దాన్ని రద్దు చేసుకుని.. ఇటీవలె తిరిగి భారత పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ ఓటు వేసే అవకాశం అక్షయ్ కుమార్‌కు వచ్చింది. ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అక్షయ్ కుమార్.. సంతోషాన్ని వ్యక్తం చేశారు.


మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఓ పోలింగ్ స్టేషన్‌ వద్ద క్యూలైన్‌లో నిలబడి.. అక్షయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అక్షయ్ కుమార్.. తన దేశం అభివృద్ధి దిశగా ప్రయాణం కొనసాగించాలని.. తాను బలంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అదే మనసులో పెట్టుకునే ఈ ఎన్నికల్లో తాను ఓటు వేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు వారికి ఏది సరైందని భావిస్తే.. దానికే ఓటు వేయాలని అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఓటర్లు అంతా ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఓటు వేయాలని.. ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తనకు భారత పౌరసత్వం తిరిగి వచ్చిన తర్వాత తొలిసారి ఓటు వేయడంపై అక్షయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.


గతంలో కెనడా పౌరసత్వం కలిగి ఉన్న అక్షయ్ కుమార్‌కు 2023 లో మళ్లీ భారత పౌరసత్వం వచ్చింది. 1990 ల్లో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు వరుసగా 15 డిజాస్టర్‌ అయ్యాయి. ఆ సమయంలో ఆయన తన సినీ కెరీర్‌లో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. దీంతో కెనడాలో ఉన్న తన స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు అక్షయ్ కుమార్ తెలిపారు. అందుకోసమే కెనడా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలోనే అక్షయ్ కుమార్ నటించిన 2 సినిమాలు రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద ఘన బ్లాక్ బస్టర్ కావడంతో కెనడా వెళ్లే ఆలోచనను విరమించుకున్నారు. అయితే అప్పటికే కెనడా పాస్‌పోర్ట్ వచ్చినా దాన్ని పట్టించుకోలేదని అయితే దాన్ని రద్దు చేసుకోవడాన్ని మరిచిపోయినట్లు అక్షయ్ కుమార్ తెలిపారు.


అయితే ఈ విషయం 2019 లో బయటికి వచ్చింది. ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా దేశ ప్రజలందరూ ఎన్నికల్లో ఓటు వేయాలని అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపే తీవ్ర విమర్శలకు దారి తీసింది. భారత్‌లో ఓటు హక్కు కూడా లేని వ్యక్తి.. దేశ ప్రజలకు ఎలా ఓటు వేయాలని సూచిస్తారని చాలా మంది ప్రశ్నించారు. చివరికి స్పందించిన అక్షయ్ కుమార్.. తాను తిరిగి భారత పౌరసత్వాన్ని పొందాలని అనుకుంటున్నానని.. పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయనకు 2023లో భారత పౌరసత్వం తిరిగి వచ్చింది. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కలిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com