ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలకు ఇబ్బందులు.. అప్పటి నుంచి బంద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 09:54 PM

పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకానికి ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బందులు వచ్చాయి. ఆరోగ్య శ్రీ సేవలు అందించే విషయంలో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం సోమవారం లేఖ రాసింది. పెండింగ్ బకాయిలు చెల్లించని కారణంగా ఎల్లుండి (బుధవారం) నుంచి ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు అందులో స్పష్టం చేసింది. 2023 ఆగస్ట్ నుంచి బకాయి ఉన్న 1500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని.. లేకుంటే మే 22 నుంచి సేవలు నిలిపివేస్తామంటూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాకు ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం లేఖరాసింది.


మరోవైపు పెండింగ్ బకాయిల విషయమై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. అయినా ఇప్పటి వరకూ కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లించారని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని లేఖలో తెలిపింది. మరోవైపు బకాయిల చెల్లింపుల విషయంలో మే నెల ప్రారంభంలో నెట్వర్క్ ఆస్పత్రులు కూడా ప్రభుత్వానికి లేఖలు రాశాయి. బకాయిలు చెల్లించకపోతే మే 4 నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామంటూ అందులో హెచ్చరించాయి. తాజాగా ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం కూడా ఇదే విషయమై వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు లేఖ రాసింది.


అయితే 2023 ఆగస్టు నుంచి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలంటూ ఆస్పత్రులు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. దీనిపై పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాయి. అలాగే ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న చికిత్సలకు ఇచ్చే ప్యాకేజీ రేట్లను కూడా పెంచాలని కోరుతున్నాయి. సుమారుగా పదేళ్ల కిందటి ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో ప్యాకేజీ ధరలు పెంచాలని కోరుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com