గొంతు నొప్పిగా ఉందని, ఎవరూ చనిపోయేంత ప్రమాదకర పరిస్థితులు అయితే లేవని ఢిల్లీ వాతావరణ కాలుష్యంపై బంగ్లాదేశ్ క్రికెట్ కోచ్ రస్సెల్ డొమింగో అభిప్రాయపడ్డాడు. టీ20కి ముందు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న పరిస్థితులు సరైనవి కాదని అంగీకరించాడు. అయితే ఇరు జట్లకు ఇది ఒకటేనని, వారు దీనిని ఎదుర్కోవాల్సిందేనని అన్నాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో శుక్రవారం ఢిల్లీలో ప్రభుతం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తొలి టీ20పై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కోచ్ రస్సెల్ డొమింగో మాట్లాడుతూ "ఢిల్లీలో వాతావరణం అద్భుతంగా ఉంది. వేడిగా అయితే లేదు. అలాగే గాలి కూడా లేదు. పొగమంచుతో స్పష్టంగానూ లేదు. ఇరు జట్లకు ఇది ఒకటే. ఇది పరిపూర్ణంగా లేదు, ఆదర్శంగా లేదు. దీని గురించి మేము ఫిర్యాదు చేయడం లేదు" అని అన్నాడు. "మేము సాధ్యమైనంతవరకు మ్యాచ్కు సిద్ధంగా ఉండాలి. కాలుష్యం వల్ల స్పష్టంగా కనిపించకపోవడం... గొంతు నొప్పి వస్తున్నాయి. అయితే, ఎవరికీ అనారోగ్యం లేదా చనిపోయేంతగా పరిస్థితులు లేవు. ఇలాంటి వాతావరణంలో మైదానం బయట ఆరు లేదా ఏడు గంటల పాటు ఉండటానికి మేము ఇష్టపడము. మూడు గంటల ఆట కాబట్టి మూడు గంటల ప్రాక్టీస్ సరిపోతుంది" అని తెలిపాడు.ఐసీసీ నిషేధంతో భారత పర్యటనకు షకీబ్ దూరం కావడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు గాను రసెల్ డొమింగో మాట్లాడుతూ "గత రెండు వారాలు కష్టంగా ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఇలాంటివి జరిగినా ముందుకు సాగాలి. జట్టు ప్రస్తుతం అద్భుతంగా ఉంది, యువ ఆటగాళ్లు బాగా కష్టపడుతున్నారు. వారంతా ఆనందంగానే ఉన్నట్లు అనిపిస్తుంది" అని అన్నారు. ఓ బుకీ తనను సంప్రదించిన విషయాన్ని షకీబ్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు తెలపకపోవడంతో అతడిపై రెండేళ్ల నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఐసీసీ నిషేధంతో ఆదివారం నుంచి ఆరంభమయ్యే భారత్ పర్యటనతో పాటు వచ్చే ఏడాది ఆసీస్ వేదికగా జరిగే టీ20 వరల్డ్కప్కు షకీబ్ దూరమయ్యాడు. కాగా, వాతావరణ కాలుష్యం కారణంగా తొలి టీ20లో ఇరు జట్ల క్రికెటర్లు వాయు కాలుష్యం బారిన పడి ఏమైనా సమస్యలకు లోనైతే ఏమి చేయాలని డీడీసీఏ కలవరపడుతోంది. శుక్రవారం ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా తగ్గింది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 357గా నమోదైంది. అయితే, శుక్రవారానికి గాలి నాణ్యత సూచిక 400 దాటింది. దీంతో ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.