ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్య శ్రీ కార్డుతో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులలోనూ వైద్య సేవలు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2019, 04:03 PM

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది.  నేటి నుంచి పొరుగు రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తో వైద్య సేవలు అమలులోకి వచ్చాయి.. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన్ని సీఎం జగన్‌  నేడు ప్రారంభించారు. చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్‌ ఆసుపత్రుల డాక్టర్లు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. చికిత్సల విధానం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఏపీకి చెందిన వారిని బాగా చూసుకోవాలని డాక్టర్లను కోరారు జగన్. ఎంతో నమ్మకంతో చికిత్స కోసం ఏపీ నుంచి వచ్చారని వారు కోలుకునే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ ఎంతో మందికి పునర్జన్మ ఇచ్చిన కార్యక్రమం అని డాక్టర్లు అన్నారు. అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వర్తింపుతో ఏపీకి చెందిన పేదలు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లో సెలెక్టెడ్ ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందొచ్చని అధికారులు తెలిపారు. 17 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు ఈ 3 నగరాల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2020 జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ జాబితాలో 1,200 జబ్బులకు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. వైద్య చికిత్సలు ఖరీదుగా మారిన నేపథ్యంలో  వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పేదలకు చాలా ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com