పొలవరం పనులను రీ టెండరింగ్ ద్వారా దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఈరోజు ప్రాజెక్ట్ వద్ద పనులను ప్రారంభించింది. పోలవరం నిర్మాణ పనులకి మేఘా ఇంజినీరింగ్ డీజీఎం సతీష్, పీఎం మురళి భూమి పూజ చేశారు. జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ.4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా.. మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ.4358 కోట్లకు కోట్ చేస్తూ టెండర్ దాఖలు చేసింది.
గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే 12.6 శాతం తక్కువకు మేఘా కోట్ చేసింది. దీంతో పోలవరం కాంట్రాక్టును మేఘా సంస్థ దక్కించుకుంది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణనలోకి తీసుకుని దాని ఆధారంగా అధికారులు బిడ్డింగ్ నిర్వహించారు.కాగా, రీ టెండరింగ్తో రూ.628 కోట్లు ఆదా అయ్యిందని ప్రభుత్వం తెలిపింది.