తిరుమలలో శుక్రవారం (జూన్ 14, 2019) జ్యేష్టాభిషేకం ప్రారంభమైంది. మొదటిరోజున శ్రీ దేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వజ్రకవచంతో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో కనుల విందుగా స్వామివారి వాహన సేవ సాగింది. దీనికి ముందు ఆలయంలోని సంపంగి ప్రదక్షణంలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం రుత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు.
అనంతరం శ్రీ దేవి, భూదేవి , సమేత మలయప్పస్వామి వారికి వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ వేడుకల్లో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణ సూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంతో ఉత్సవ మూర్తులకు విశేషంగా అభిషేకం నిర్వహించారు.జేష్టాభిషేకం కారణంగా శుక్రవారం పసంతోత్సవం ఆర్జిత సేవలను TTD రద్దు చేసింది. శనివారం (జూన్ 15, 2019) ముత్యాల కవచం, ఆదివారం (జూన్ 16, 2019) స్వర్ణకవచంతో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో TTD పెద్దజియ్యర్ స్వామి, చిన్నజియ్యర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.