ఈ నెల 17న దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. పశ్చిమబెంగాల్లో ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ ఆందోళనలకు దిగిన వైద్యులకు సంఘీభావంగా ఐఎంఏ మూడురోజుల పాటు జరిగే వైద్యుల దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలను శుక్రవారం నుంచి ప్రదర్శనలు చేపట్టింది. 17న జరిగే సమ్మె రోజు అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అవుట్ పేషంట్ విభాగాలతో పాటు అత్యవసరం కాని వైద్య సేవలన్నిటినీ 24 గంటల పాటు నిలిపివేయాలని సూచించింది.అయితే అత్యవసర, క్యాజువాలిటీ సేవలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఆస్పత్రుల్లో వైద్యులపై దాడులను నిరోధించేందుకు కేంద్ర చట్టం తేవాలనే తమ డిమాండ్ను పునరుద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఐఎంఏ లేఖ రాసినట్టు తెలిపింది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా వైద్యులంతా నల్లబ్యాడ్జీలు ధరించాలని, ధర్నాలు, శాంతియాత్రలు నిర్వహించాలని సూచించింది.