వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన సమాజ్ వాడి పార్టీ నేత ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి , రాంపూర్ నియోజకవర్గ అభ్యర్థి ఆజంఖాన్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో ,మాజీ పార్లమెంట్ సభ్యురాలు, తన ప్రత్యర్థి సినీనటి జయప్రదపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో యూపీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె లోదుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలపట్ల జయప్రద మండిపడిన సంగతి తెలిసిందే. కాగా, అజాంఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖాశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసిన అజాంఖాన్ పై ఎన్నికల కమిషన్ కఠినచర్యలు తీసుకోవాలని రేఖాశర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఆమె లేఖ రాశారు. జయప్రదపై అజాంఖాన్ చేసిన వ్యాఖ్యల కేసును సూమోటోగా విచారణకు స్వీకరించిన రేఖా శర్మ .. ఆజాంఖాన్కు నోటీసులు జారీ చేశారు.