భీమవరాన్ని అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దుతానంటూ ప్రచారం చేసిన జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్, ఆయన సోదరుడు నరసాపురం లోక్సభ అభ్యర్థి నాగేంద్రబాబు ఎన్నికల తర్వాత కన్పించకపోవడం చర్చనీయాంశమైంది. ప్రతిష్టాత్మకమైన భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, జనసేన అభ్యర్థి పవన్కల్యాణ్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నా నామ మాత్రమేననే ప్రచారం ఉంది. జనసేన అభ్యర్థులు పవన్కల్యాణ్, నాగేంద్రబాబుకు ఇక్కడ ఓట్లు లేకపోవడంతో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లేకపోయింది. జనసేన అధినేత పవన్కల్యాణ్ పోటీ చేస్తుండటంతో భీమవరం అందరి దృష్టిని ఆకర్షించింది. అతడి సోదరుడు నరసాపురం లోక్సభ అభ్యర్థి నాగేంద్రబాబు లోక్సభ నియోజకవర్గ పరిధిలో పర్యటించినా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఈ విషయం జనసేన శ్రేణులను నిరాశకు గురిచేసింది. పవన్కల్యాణ్ రాలేకపోయినా కనీసం నాగేంద్రబాబు వచ్చి ఉంటే ఓటర్లలో మరింత చైతన్యం వచ్చేదని తద్వారా పార్టీకి ఉపయోగపడేదని నాయకులు చెబుతున్నారు.