ఎన్నికలు ముగిశాయి.. గెలుపెవరిది? అధికారం.. టీడీపీకా, వైసీపీకా? ఇదే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. గెలుపు టీడీపీది అని కొందరు అంటుంటే.. కాదు వైసీపీది అని మరికొందరు విశ్లేషిస్తున్నారు. దీంతో.. పందెం రాయుళ్లు సై అంటే సై అని కాలు దువ్వుతున్నారు. ఓవైపు IPL హీట్ మరోవైపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై హైటెన్షన్. దీన్ని క్యాష్ చేసుకుంటున్న బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. వీరికితోడు అన్ని పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు కూడా కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్లకు పైనే. ఇక రిజల్ట్ టైంకి ఈ బెట్టింగ్ వ్యవహారం 4 వందల కోట్లకు పైనే వచ్చే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు.. లోక్సభ ఎన్నికలు నిర్వహించినా.. పందెం రాయుళ్ల టార్గెట్ మాత్రం అసెంబ్లీ అభ్యర్థులే. ఫలానా అసెంబ్లీ నియోజక వర్గంలో విజయం మా అభ్యర్థిదే అంటూ.. బెట్టింగ్కు దిగుతున్నారు. లోక్సభ ఎన్నికలను పెద్దగా పట్టించుకోని పందెం రాయుళ్లు.. అసెంబ్లీపైనే పూర్తిగా దృష్టి సారించారు. గెలుపు మాత్రమే కాదు.. మెజార్టీపై కూడా పందెం కాస్తున్నారు. అదే సమయంలో ఫలానా నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని కాసే పందెం ఒకటైతే.. రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది..? ఎవరు సీఎం అవుతారు..? ఎన్ని సీట్లు వస్తాయన్న..? దానిపై బెట్టింగ్ సాగుతోంది. అభ్యర్ధుల జయాపజయాలు తేలే రోజు మే 23 ఎప్పుడు వస్తుందోనని బెట్టింగ్ రాయుళ్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాము అభ్యర్ధులపై కాసిన పందెం గెలుస్తామా లేదోనని తెగ టెన్షన్ పడుతున్నారు. వందల కోట్లలో బెట్టింగ్లు నిర్వహిస్తూ.. అభ్యర్ధుల్లో మరింత టెన్షన్ రేకెత్తిస్తున్నారు. పందెం రాయుళ్లు ఎక్కువగా.. భీమిలీ, గాజువాక, గుడివాడ, మంగళగిరి, చీరాల, నెల్లూరు సిటీ, సర్వేపల్లి, జమ్మలమడుగు, హిందూపురం, భీమవరం, తాడేపల్లి గూడెం, వైజాగ్, సర్సాపురం నియోజక వర్గ సీట్లపై ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఇదంతా నాణానికి ఒక వైపు అయితే.. మరోవైపు పందెం రాయుళ్లు దొరికితే మాత్రం తోలుతీస్తామని అంటున్నారు పోలీసులు. బెట్టింగ్లపై ఓ కన్నేసి ఉంచారు. అనుమానం ఉన్న చోట నిఘా పెంచారు.