వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ ఐదేళ్లలో అన్ని వర్గాలనూ ఆదుకుందని, అన్ని వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. రైతులు,మహిళల అభ్యున్నతికి,ఆర్థిక ప్రగతికి దోహదపడే నిర్ణయాలు తీసుకుందని అన్నారు. మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది, వారు సమాజంలో ఎదిగేందుకు అన్ని విధాలా సహకారం అందించి, పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునే విధంగా చేశామని చెప్పారు. గారమండలం, బూరవెల్లి గ్రామాన మంత్రి ధర్మాన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేం పాలించిన ఈ ఐదు సంవత్సరాలూ ప్రతి గడపకూ వచ్చాం. మేం పాలించిన ఈ ఐదేళ్లూ మీతోనే మమేకం అయ్యాం. మీ సమస్యేంటో ప్రతిదీ తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేశాం. అధికారం ఇచ్చారు కదా అని ఏరోజూ మీకు దూరంగా మేం లేము. ఎప్పటికప్పుడు కలుస్తునే ఉన్నాం. మీకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అందించగలిగాం. బ్రోకర్లు లేకుండా,లంచాలు లేకుండా డైరెక్టుగా మీ అకౌంట్లకే డబ్బులు వేశాం. అవినీతి రహిత పాలనను అందించాం. ముఖ్యంగా పథకాల అమలులో కులం చూడలేదు. మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. మీ ఇంటిపై మా పార్టీ జెండా కట్టారా లేదా అన్నది కూడా చూడలేదు. పథకాల వర్తింపునకు అర్హతే ప్రామాణికంగా అమలు చేశాం. దాని వల్ల మీ కుటుంబంలో మీ జీవనం హాయిగా సాగింది. ఎవరికీ తలవంచకుండా జీవించేందుకు వీలుగా పాలన సాగించాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. పరిపాలనను గ్రామంలోకి తీసుకుని వచ్చాం. ఎవ్వరికీ తలవంచకుండా మీ పనులన్నింటినీ చేసే విధంగా పాలన తీసుకుని వచ్చాం. కావున ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలని కోరుతున్నానని అన్నారు.