రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజారాజ్యం నడవడం లేదు.. మాఫియా రాజ్యం నడుస్తోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని.. 39 మంది చనిపోయారని.. 26 గ్రామాలు దెబ్బతిన్నాయని.. ఇది విని ఆందోళన చెందానని తెలిపారు. రాష్ట్రంలో మంత్రులు రౌడీ, గూండాయిజం చేస్తున్నారని.. మాఫియాకు ప్రభుత్వ మద్దతు ఉందని.. మాఫియాకు ఎన్డీయే సర్కార్ గట్టిగా బుద్ధిచెబుతుంది’ అని స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా అన్నమయ్య జిల్లా కలికిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. తన ప్రసంగాన్ని.. నా ఆంధ్ర కుటుంబసభ్యులకు నమస్కారం అంటూ మొదలు పెట్టారు. తర్వాత మధ్యలోకూడా ‘ఆంధ్రప్రదేశ్ వికాసం.. మోదీ లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కారు రావాలి..’ అంటూ తెలుగులో మాట్లాడారు. అనంతరం జగన్ ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు. ‘రాయలసీమలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. అయితే ఇక్కడ గనులు, ఖనిజాలు ఉన్నాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు. ప్రతిభావంతులైన యువతీయువకులు ఉన్నారు. పర్యాటక రంగానికి కూడా ఎంతో అవకాశం ఉంది. రాయలసీమ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చా.. జనం ఎందరికో ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. అయితే వాళ్లు ఆ మేరకు అభివృద్ధి చేయలేదు. సాగునీటి సౌకర్యాలు లేవు. పరిశ్రమలు లేవు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉద్యోగాల కోసం ఇక్కడి వాళ్లు వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఈ పరిస్థితి మార్చేందుకు ఆంధ్రలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి’ అని స్పష్టం చేశారు.