వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు సీఎం జగన్. గత 59 నెలల్లో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నామన్నారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి ప్రజలకు పరిపాలనను చేరువ చేశామని గుర్తు చేశారు. ఇచ్చిన ప్రతి హామీకి పరిష్కారాలు వెతుకుతూ అమల్లోకి తెచ్చామని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. 99శాతం హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చామన్నారు. ప్రతి ఏటా మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాం. మ్యాన్మేడ్ సమస్యలకు పరిష్కారం మా 59 నెలల పరిపాలన అన్న జగన్, అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయికి పథకాలు తీసుకెళ్లామన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, కొత్తగా నిర్మిస్తున్న ఓడ రేవులు, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి అభివృద్ధి కాదా ? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి 33 వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. వైసీపీ హయాంలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ విషయాలు ప్రజలు ఆలోచించాలని కోరారు.