మోదీని గద్దె దించితేనే దేశాభివృద్ధి సాధ్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. మోదీకి బీజేపీ ఓటమి స్పష్టంగా కనిపిస్తోందని, అందుకే అదానీ, అంబానీలను తిట్టడం మొదలుపెట్టాడని, మూడు దశలుగా జరిగిన ఎన్నికల్లోనూ మోదీ ప్రభావం పూర్తిగా తగ్గిందనేది తేలిపోయిందన్నారు.మోదీ పాలనలో ప్రజాస్వామ్య పునాదులైన నాలుగు స్తంభాలు దెబ్బ తిన్నాయని, పదేళ్ల మోదీ పాలనలో దేశం రెండు విధాలుగా మారిందని, ఒకటి ధనిక దేశం, రెండు పేద దేశంగా కనిపిస్తోందని చెప్పారు. దేశాన్ని కాపాడుకోవాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. మోదీ ప్రభుత్వ పది దారుణాలపై పుస్తకాన్ని సీతారాం ఏచూరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర నేత మధు ఆవిష్కరించారు. కాగా, కృష్ణాజిల్లా గన్నవరంలో నిర్వహించిన సభలో ఏచూరి మాట్లాడుతూ, ‘రాజ్యాంగానికి పునాది అయిన ప్రజాస్వామ్య లౌకికవాదం, ఆర్థిక సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, ఫెడరలిజంపై పదేళ్లుగా తీవ్రదాడులు జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడమే మోదీ, ఆర్ఎ్సఎస్ లక్ష్యం’ అని విమర్శించారు. మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం 42 శాతానికి పెరిగిందన్నారు.