ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్గదర్శి కేసులో బెయిల్ పొందిన ఆడిటర్‌ శ్రవణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 02:59 PM

మార్గదర్శి వ్యవహారంలో ఆడిటర్‌ శ్రవణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సంతృప్తి మేరకు రూ.50,000 చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని, విచారణకు శ్రవణ్‌ సహకరించాలని నిర్దేశించింది. ఆయనకు విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. రాజ్యాంగంలోని 22(2) అధికరణ ప్రకారం పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలని.. అరెస్టు చేసి 24 గంటలు మించిందా లేదా అనే విషయాన్ని నమోదు చేయడంలో మేజిస్ట్రేట్‌ విఫలమయ్యారని పేర్కొంది. పిటిషనర్‌ను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉండగా సీఐడీ అధికారులు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడంపై అభ్యంతరం తెలిపింది. డిపాజిటర్ల చట్టంతో ముడిపడి ఉన్న వ్యవహారంలో రిమాండ్‌ విధించే విచారణాధికార పరిధి మేజిస్ట్రేట్‌కు లేదని, చట్టనిబంధనలు పరిగణనలోకి తీసుకోవడంలో మేజిస్ట్రేట్‌ విఫలమయ్యారని పేర్కొంది. విచారణాధికారపరిధి దాటి మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా రిమాండ్‌ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు బాధిత వ్యక్తి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని గౌతమ్‌ నవలఖ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేసింది. పిటిషనర్‌కు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించారని ప్రాథమికంగా అభిప్రాయపడింది. వ్యక్తి ప్రాఽథమిక హక్కులు హరించి చేసిన తప్పును తదుపరి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా సరిచేసుకోలేరని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ వి.శ్రీనివా్‌సతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మార్గదర్శి వ్యవహారంలో తన భర్త, ఆడిటర్‌ శ్రవణ్‌కు రిమాండ్‌ విధిస్తూ విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ శ్రవణ్‌ భార్య డాక్టర్‌ నర్మద హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో అనుబంధ పిటిషన్లపై పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి, సీఐడీ తరఫున న్యాయవాది శివకల్పనారెడ్డి వాదించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ఇటీవల ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. గురువారం నిర్ణయం వెలువరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com