ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వారందరి అకౌంట్‌లలోకి డబ్బులు జమ చేస్తాం.. చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 10:54 PM

ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 4 (శుక్రవారం) నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని.. వరదల వల్ల నష్టపోయిన వారిలో ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండటానికి వీల్లేదు అన్నారు. వరద సాయం పంపిణీలో సమస్యలు, బాధితుల ఫిర్యాదులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు.. ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. అయితే సాంకేతిక సమస్యలతో 22,185 మంది లబ్ధిదారుల అకౌంట్‌లలో డబ్బులు జమ కాలేదు.


ఏపీ ప్రభుత్వం మొత్తం రూ.602 కోట్ల పరిహారం పంపిణీకి సంబంధించి.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.588.59 కోట్లు జమ చేసిందన్నారు చంద్రబాబు. ఇప్పటికే 97% మంది అకౌంట్‌లలోకి డబ్బులు చేరాయని.. అకౌంట్ వాడకంలో లేకపోవడం, మరికొందరి అకౌంట్‌లకు ఆధార్ లింక్ కాకపోవడం, కొన్ని అకౌంట్‌లు క్లోజ్ కావడం, మరికొందరు అకౌంట్‌ నంబర్ తప్పుగా నమోదు చేయడం, కొందరి వివరాలు సరిగా లేకపోవడం వంటి సాంకేతిక కారణాలతో 22,185మందికి డబ్బులు సాయం జమ కాలేదన్నారు. అందుకే అకౌంట్‌లలో డబ్బులు జమకాని వారు బ్యాంకకు వెళ్లి కేవైసీని పరిశీలించుకోవాలని సూచించామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు చంద్రబాబు.


అలాగే మరికొందరు వరద బాధితులు ఇప్పుడు పరిహారం కోసం దరఖాస్తు చేస్తున్నారన్నారు చంద్రబాబు. వాటిని పరిశీలించి అర్హులైన వారికి సాయం అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అకౌంట్‌లలో వరద సాయానికి సంబంధించిన డబ్బు పడని వారు.. సచివాలయ సిబ్బందిని సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించామన్నారు. రుణాల రీషెడ్యూల్, వరదల కారణంగా దెబ్బతిన్న వాహనాలకు బీమా చెల్లింపు, అర్బన్‌ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్‌ వస్తువుల మరమ్మతులతో పాటుగా తదితర అంశాలపైనా ముఖ్యమంత్రికి వివరించారు.


వరద ముంపు ప్రభావిత బాధితులకు కుటుంబం యూనిట్‌గా ఆర్థిక సహాయాన్ని అందిస్తోందన్నారు కలెక్టర్ సృజన. వరద బాదిత కుటుంబంలో ఒకరిని గుర్తించి, వారి ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు అకౌంట్‌లలో డీబీటీ ద్వారా డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబంలో మరో వ్యక్తిని లబ్దిదారునిగా గుర్తించడానికి వీలులేని విషయాన్ని గుర్తించాలని.. అనవసరంగా అర్జీలు అందజేయొద్దని సూచించారు. వరద బాధితులకు అత్యంత పారదర్శకంగా సహాయం అందిస్తున్నామని..ఇప్పటివరకు ఇళ్లు, వాహనాలు తదితర నష్టాలకు సంబంధించి 1,12,481 మంది బ్యాంకు ఖాతాల్లో సాయం జమ చేసినట్లు తెలిపారు.


ఇప్పటికే ఎన్యూమరేషన్‌ జరిగి, గుర్తించిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిందన్నారు కలెక్టర్ సృజన. ఆధార్‌తో బ్యాంక్‌ అకౌంట్ లింక్‌ కాకపోవడం, వినియోగంలో లేకపోవడం వంటి కారణాల వల్ల దాదాపు 20 వేలమంది అకౌంట్‌లలో డబ్బులు జమకాలేదని వివరించారు. ఈ సమాచారాన్ని ఇప్పటికే పంపించామని.. వెంటనే ఆధార్‌కు బ్యాంకు అకౌంట్‌ను అనుసంధానం చేసుకొని వినియోగంలోకి తెచ్చుకోవాలని సూచించారు. అలాగే సచివాలయ సిబ్బంది కూడా బాధితులకు సహకారం అందిస్తారన్నారు.


బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ కాని వారు.. వెంటనే ఆ పని పూర్తి చేయాలన్నారు కలెక్టర్. ఆధార్‌తో అనుసంధానం అయిన రెండు రోజుల్లో అకౌంట్‌లలో పరిహారం జమ చేస్తామన్నారు. పరిహారం అందని వాళ్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎవరూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అసవరం లేదన్నారు. అంతేకాదు వరద బాధితులకు పరిహారం కోరుతూ గ్రీవెన్స్‌లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి.. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే పరిష్కరించి ఆపై అర్హులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com