కర్నూలు జిల్లా, హొళగుంద మండలంలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన (పీఎంఏవై) ప్రధానమంత్రి ఆవాసయోజన పథకానికి పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాను హౌసింగ్ అధికారులకు ఇవ్వడంతో వారు జాబితాలో ఉన్న లబ్ధిదారుల నుంచి పొజిషన్ పట్టా అడిగారు. దీంతో గతవారం రోజులుగా వందల సంఖ్యల లబ్ధ్దిదారులు పొజిషన్ పట్టా కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారులు అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే రూ. 2 వేలు తీసుకుని పట్టాలపై సంతకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా సుమారు లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమా చారం. డబ్బు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే పై అధికారులకు కూడా వాటా ఇవ్వాలంటున్నారని లబ్ధిదారులు తెలుపుతున్నారు. లేకుంటే సంతకాలు పెట్టకుండా దరఖాస్తును తిరస్కరిస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వసూళ్లకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ హుసేన్ సాబ్ను వివరణ కోరగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు.