46 మంది వైద్యుల బదిలీలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్ దాదాపు ఏడు నెలల సమయం తీసుకుంది. గత ఏడాది నవంబరులో బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ విడుదల కాగా, జనవరి వరకూ ఏపీవీవీపీ కమిషనర్ వద్దనే ఫైల్ పెండింగ్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆరోగ్యశాఖ కమిషనర్ దగ్గర దాదాపు నెల రోజులు, ముఖ్యమంత్రి కార్యాలయంలో నెల రోజుల పాటు ఫైల్ పెండింగ్లో ఉంది. చివరికి సీఎం కూడా బదిలీలకు ఆమోదం తెలిపి, ఫైల్ను ఆరోగ్యశాఖకు పంపించినా.. ఆర్థిక శాఖ 20 రోజులపాటు ఫైల్ పెండింగ్లో పెట్టుకుని.. తర్వాత కొన్ని కొర్రీలు వేసింది. ఆరోగ్యశాఖ అధికారులు కేవలం ఒక్క రోజులోనే ఆ కొర్రీలకు స్పష్టతనిచ్చినా ఇప్పుడు మళ్లీ వారం రోజుల నుంచి ఫైల్ను ఆర్థిక శాఖ వద్దనే పెండింగ్లో పెట్టుకుంది. దీనిపై ప్రభుత్వ వైద్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం, రెండు వారాల్లో పూర్తి కావాల్సిన బదిలీల ప్రక్రియను ఆరేడు నెలలుగా సాగదీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇంకెన్నాళ్లు సాగదీస్తారోనని వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.