ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్ బస్సు దగ్ధం.. చిన్నారులు సహా 25మంది సజీవ దహనం, మొత్తం 44 మంది విద్యార్థులు

international |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 11:29 PM

ఎప్పుడూ స్కూల్‌, ఇల్లు ప్రపంచంగా ఉండే విద్యార్థులకు ఉల్లాసం కోసం, కొత్త విషయాలు, ప్రాంతాలు తెలియడం కోసం యాజమాన్యాలు అప్పుడప్పుడూ విహారయాత్రలకు తీసుకెళ్తూ ఉంటాయి. అయితే ఆ విహారయాత్ర కాస్తా విషాదంగా మారిన ఘటన ప్రస్తుతం ప్రతీ ఒక్కర్నీ కంటతడి పెట్టిస్తోంది. ట్రిప్‌కు వెళ్లిన స్కూలు విద్యార్థులు బాగా ఎంజాయ్ చేసి.. తిరిగి ఇంటికి వెళ్తున్నారు. అయితే వారు ప్రయాణించిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ బస్సు మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో విద్యార్థులు, డ్రైవర్, టీచర్లు సహా మొత్తం 44మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 25 మంది చిన్నారులు.. ఆ మంటల్లో చిక్కుకుని కాలి బూడిదైపోయారు. ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నడిరోడ్డుపై బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుని కాలిపోవడం అందులో కనిపిస్తోంది. స్కూల్ ట్రిప్‌కు వెళ్లిన ఓ పాఠశాల బస్సు సెంట్రల్‌ ఉతాయ్‌ థాని ప్రావిన్స్‌ నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 38 మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు, బస్సు సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు మొత్తం 25మంది చనిపోయారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా.. చిన్నారుల మృతులకు సంతాపం తెలిపారు.


అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టైరు పేలిపోయిందని కొందరు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు వెల్లడించారు. మరోవైపు.. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా అందులోని మృతదేహాలను బయటకు తీసుకురాలేదని స్థానికులు ఆరోపించారు. 16మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లను ఆ బస్సులో నుంచి బయటికి తీసుకువచ్చామని.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు థాయ్‌లాండ్‌ రవాణశాఖా తెలిపింది. మిగిలిన వారి పరిస్థితిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదని పేర్కొంది. ఆ మంటలు చూస్తుంటే వారంతా అందులోనే కాలి బూడిదైపోయి ఉంటారని స్థానికులు వెల్లడించారు.


మృతుల సంఖ్యను ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని థాయిలాండ్ అంతర్గత మంత్రి అనుతిన్‌ చర్నవిరకుల్‌ పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో ఇంకా దర్యాప్తు జరుగుతోందని.. ప్రమాదం నుంచి 19 మంది బయటపడటంతో మిగిలిన 25 మంది చనిపోయి ఉండవచ్చని తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో బస్సు కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ బస్సు నుంచి భారీగా మంటలు, పొగ ఎగిసిపడుతున్నట్లు ఆ వీడియోల్లో కనిపిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com