ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి వరద సాయం విడుదల చేసిన కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 10:45 PM

దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. దీంతో ప్రాణనష్టంతో పాటుగా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ.. వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా ఇబ్బందులు పడిన రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు కూడా కేంద్ర హోంశాఖ వరద సాయం రిలీజ్ చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,036 కోట్లు కేటాయించింది. అలాగే తెలంగాణకు రూ. 416.80 కోట్లు వరద సాయంగా విడుదల చేసింది. స్టేట్ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ అడ్వాన్స్‌ నుంచి కేంద్ర హోంశాఖ ఈ నిధులు మంజూరు చేసింది. వరద నష్టంపై కేంద్ర బృందాలు సమర్పించిన ప్రాథమిక నివేదికల ఆధారంగా తక్షణ సాయంగా ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. పూర్తిస్థాయి నివేదికల తర్వాత మరిన్ని నిధులు విడుదల చేస్తామని పేర్కొంది.


మరోవైపు ఆగస్ట్ నెల చివరిలో సంభవించిన వరదల కారణంగా ఏపీలో ప్రాణ నష్టంతో పాటుగా ఆస్తి, పంట నష్టం కూడా జరిగింది. వరదల నష్టంపై ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రానికి నివేదిక పంపింది. వరదల కారణంగా రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి పంపిన ప్రాథమిక నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అత్యధికంగా రోడ్లు భవనాలశాఖకు రూ.2,164.5 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అలాగే నీటివనరుల శాఖకు రూ.1568.5 కోట్లు, పురపాలకశాఖకు రూ.1,160 కోట్లు చొప్పున నష్టం జరిగిందంటూ శాఖలవారీగా వరద నష్టం వివరాలను కేంద్రానికి పంపారు. ఇక వరద నష్టంపై అధ్యయనం కోసం కేంద్ర బృందాలు కూడా ఏపీలో పర్యటించాయి. వరదలు సంభవించిన ప్రాంతాలను పరిశీలించి.. ప్రాథమిక నివేదిక తయారుచేశాయి. ఈ నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేశాయి.


కేంద్ర బృందాలతో పాటుగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కూడా అప్పట్లో ఏపీలో పర్యటించారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటించిన కేంద్ర మంత్రి.. వరద నష్టాన్ని నేరుగా పరిశీలించారు. ఇక కేంద్ర బృందాలు సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ ఈ వరద సాయం విడుదల చేసింది. అయితే రాష్ట్రం రూ.6,880 కోట్లు నష్టం జరిగిందని చెబుతుంటే.. కేంద్రం రూ.1,036 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అయితే ఈ సాయం వరద నష్టంపై ప్రాథమిక నివేదికల ఆధారంగా విడుదల చేశామని.. పూర్తిస్థాయి నివేదికలు వచ్చిన తర్వాత మరింత సాయం చేస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలిగిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com