ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్ధరామయ్య ఈడీ కేసులో సంచలన ట్విస్ట్.. ముడా కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 11:07 PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడా కుంభకోణంలో లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ కూడా రంగంలోకి దిగి కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో ముడా కేసు అనేక మలుపులు తీసుకుంటున్న వేళ.. సిద్ధరామయ్య భార్య పార్వతి సోమవారం కీలక ప్రకటన చేశారు. ముడాకు సంబంధించిన భూములను తాము వెనక్కి ఇచ్చేయనున్నట్లు పార్వతి మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి తెలిపింది. తాజాగా ముడా అధికారులు అందుకు అంగీకరించారు. ఈ ముడా భూముల వ్యవహారం సీఎం సిద్ధరామయ్యకు తలనొప్పిగా మారడంతో వాటిని వెనక్కి ఇచ్చేస్తామని పార్వతి వెల్లడించారు.


ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేని తన భర్తపై అనేక ఆరోపణలు వస్తున్నాయని.. ఆయన రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకుంటున్న వేళ.. ముడాకు చెందిన 14 ప్లాట్లను తిరిగి అదే సంస్థకు ఇచ్చేస్తున్నట్లు పార్వతి ప్రకటించారు. తన సోదరుడు పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఈ ప్లాట్లు కర్ణాటకలో ఇంతటి రాజకీయ దుమారానికి కారణం అవుతాయని ఊహించలేదని పేర్కొన్నారు. తన భర్త గౌరవానికి మించి ఈ ప్లాట్లు పెద్దవేం కావని తెలిపారు. ఇన్ని సంవత్సరాలు సిద్ధరామయ్య అధికారం నుంచి ఏమీ ఆశించని తమ కుటుంబానికి ఈ ఆస్తులు లెక్క కాదని చెప్పారు. అందుకే ఆ ప్లాట్లను తిరిగి ముడాకు అప్పగిస్తున్నానని పార్వతి వివరించారు.


అయితే ఈ ముడా భూ కుంభకోణంలో తన భర్త సిద్ధరామయ్య అభిప్రాయం ఏంటో తెలియదని పార్వతి తెలిపారు. ఈ నిర్ణయం తన కుటుంబసభ్యులతో చర్చించకుండా తనకు తానుగా తీసుకున్నట్లు చెప్పారు. సిద్ధరామయ్యపై ఆరోపణలు వచ్చిన రోజే ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నానని వివరించారు. రాజకీయ కుట్రలో తన భర్త మరింత నష్టపోతున్నాడని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్వతి వెల్లడించారు. అవసరమైతే దర్యాప్తుకు సహకరిస్తానని.. రాజకీయాలకు దూరంగా ఉండే తన తన లాంటి మహిళలను వివాదాల్లోకి లాగొద్దని ముడాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై స్పందించిన ముడా అధికారులు భూములు వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com