ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.2 కోట్లకు సర్పంచ్ పదవిని దక్కించుకున్న బీజేపీ నేత.. ఎన్నికలు లేకుండా వేలం పాటలోనే!

national |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 11:24 PM

ఎన్నికల్లో ఏకగ్రీవాలు సర్వసాధారణమే. అది మారుమూల పల్లెల దగ్గరి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వరకు ఇదే తంతు కొనసాగుతూ ఉంటుంది. చాలా గ్రామాల్లో డబ్బు, పరపతి కలిగిన వ్యక్తులు.. పోటీలో అభ్యర్థులు ఎవరూ లేకుండా చూసుకుంటారు. నయానో బయానో వారిని లొంగదీసుకుని.. బరిలో ప్రత్యర్థులు లేకుండా చూసుకుని ఏకగ్రీవంగా పదవిని దక్కించుకుంటూ ఉంటారు. తాజాగా పంజాబ్‌లోని ఓ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం వేలం పాట నిర్వహించగా.. ఓ వ్యక్తి భారీగా వేలం పాట పాడి చివరికి సర్పంచ్ కుర్చీని దక్కించుకున్నాడు. ఇందుకోసం వేలంలో ఏకంగా రూ.2 కోట్లకు సర్పంచ్ పదవిని దక్కించుకోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


పంజాబ్‌లో త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ కొన్ని గ్రామాల్లో ఎన్నికలు లేకుండానే సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురుదాస్‌పుర్‌ జిల్లాలోని హర్దోవల్‌ కలన్‌ గ్రామ పంచాయతీకి ఎన్నికలు లేకుండానే వేలం పాట నిర్వహించి సర్పంచ్ పదవిని బీజేపీ నేత దక్కించుకున్నారు. హర్దోవల్ కలన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించగా.. స్థానిక బీజేపీ నేత ఆత్మాసింగ్ ఏకంగా రూ.2 కోట్లు పాడి సర్పంచ్ కుర్చీని సొంతం చేసుకున్నారు.


అయితే హర్దోవల్ కలన్ గ్రామ సర్పంచ్ పదవి కోసం రూ.50 లక్షలతో వేలం పాటను ప్రారంభించారు. సోమవారం నాటికి వేలం పాట గడువు ముగియగా.. ఆత్మాసింగ్‌ మాత్రమే అత్యధిక బిడ్డింగ్‌ వేశారు. దీంతో ఆయననే సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసే అవకాశాలున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఎన్నికలు లేకుండా డబ్బులు ఇచ్చి.. వేలం పాట ద్వారా సర్పంచ్ పదవిని దక్కించుకోవడంతో స్థానికంగా తీవ్ర రాజకీయ దుమారం మొదలైంది. ఇది బహిరంగ అవినీతి అని.. ఇలాంటి ఏకగ్రీవ ఎన్నిక అధికారికం కాదని.. దీనిపై విచారణ జరిపి బాధ్యులను జైలుకు పంపాలని స్థానిక కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ ఘటన కాస్తా తీవ్ర వివాదాస్పదం కావడంతో జిల్లా కలెక్టర్‌ స్పందించి.. విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికకు ఆత్మాసింగ్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు.


మరోవైపు.. పంజాబ్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవం అవుతున్నాయి. బటిండా జిల్లాలోని గెహ్రి బత్తార్‌ గ్రామంలోనూ ఇలాగే వేలం ప్రక్రియ నిర్వహించగా.. రూ.60 లక్షలు పలికినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ గెహ్రీ బత్తార్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పంజాబ్‌‌లోని 13,237 సర్పంచ్ స్థానాలకు అక్టోబరు 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com