ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తానా సంస్థ ప్రతినిధులు సాయంతో దేశానికీ చేరిన విద్యార్థి పార్థివదేహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 02:58 PM

 అమెరికాలో దోపిడీ దొంగల కాల్పుల్లో ఏలూరు విద్యార్థి మృతి చెందిన విషయం విదితమే. ఈ మేరకు మృతదేహం విమానంలో గురువారం స్వదేశానికి చేరుకుంది. మృతదేహాన్ని చూసి తల్లి, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. కుటుంబానికి అండగా ఉంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. ఉన్నత స్థితిలో వస్తాడనుకున్నాం.. ఇలా నిర్జీవ స్థితిలో చూడాల్సి వచ్చిందని శోక సంద్రంలో మునిగిపోయారు. ఏలూరు అశోక్‌ నగర్‌కు చెందిన వీర వెంకట రమణకు ఇద్దరు కుమారులు. వెంకటరమణ సీఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా చేసేవారు. ఆయన నాలుగేళ్ల క్రితం మరణించగా కారుణ్య నియామకంలో పెద్ద కుమారుడికి ఉద్యోగం ఇచ్చారు. తండ్రి ఆశయం మేరకు చిన్న కుమారుడు సాయేష్‌ (24) బీటెక్‌ చదివి అమెరికాలో ఎంఎస్‌ చేయడానికి 2020లో వెళ్లాడు. చదువు కోసం రూ.30 లక్షలు బ్యాంక్‌ అప్పు తీసుకు న్నారు. మరో రెండు నెలల్లో చదువు పూర్తయ్యేది. పార్ట్‌టైంగా అక్కడ గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో పని చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 19వ తేదీ అర్ధరాత్రి ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి దోపిడీకి పాల్పడ్డగా సాయేష్‌ పోలీస్‌ అలారం నొక్కడంతో వారు తుపాకీతో కాల్పి చంపారు. తానా సంస్థ ప్రతినిధులు సాయేష్‌ మృతదేహాన్ని అక్కడ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఇండియాకు పంపించారు. విమానంలో అమెరికా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు గురువారం ఉదయం 8.30 గంటలకు చేరుకోగా జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్‌ మరికొంత మంది సిబ్బంది వెళ్ళి ప్రత్యేక అంబులెన్స్‌లో ఏలూరులోని నివాసానికి గురువారం సాయంత్రం తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన సాయేష్‌ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సాయేష్‌ స్వగ్రామమైన పాలకొల్లులోని నాగరాజు వీధిలోని స్వగృహానికి గురువారం రాత్రి మృతదేహాన్ని ఏలూరు నుంచి తరలించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అతని బాబాయ్‌ నరసింహారావు తెలిపారు. కాగా మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), పలువురు టీడీపీ నాయకులు, తహసీల్దార్‌ సోమశేఖర్‌, ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు చోడగిరి శ్రీనివాస్‌, హరినాథ్‌, మాజీ మంత్రి మరడాని రంగారావు, కార్పొరేటర్‌ లక్ష్మణరావు, ఏలూరు టూటౌన్‌ సీఐ చంద్రశేఖర్‌, రాష్ట్ర మెడికల్‌ బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ దిరిశాల వర ప్రసాద్‌, కార్పొరేటర్‌ మున్నుల జాన్‌ గురునాథ్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com