దేశం మొత్తం మీద సినిమా టికెట్ రేట్లను కనీస స్థాయి కన్నా తగ్గించేసి తెలుగు చిత్రపరిశ్రమను ఒక రేంజులో ఇబ్బందులకు గురిచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో వివాదాస్పద ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మూవీ ఎక్జిబిటర్లు తమ సినిమా రెవెన్యూలను తమ ఖాతాలలోకి కాకుండా ప్రభుత్వ ఖాతాలలోకి జమ చేయవలసి ఉంటుంది. పోస్ట్ సర్వీస్ ఛార్జ్ డిడక్షన్ చేసి కొంతకాలం తర్వాత ఆయా ఎక్జిబిటర్ల ఖాతాలలోకి ప్రభుత్వం డబ్బును జమ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను ప్రభుత్వం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్లకు పంపించింది. ఈ పత్రాలపై సంతకం చెయ్యడానికి ఒక నెలరోజులు సమయం కూడా ఇచ్చింది. ఐతే, ప్రభుత్వం ఇలా చెయ్యటం చాలా అన్యాయమని ఎక్జిబిటర్లు వాపోతున్నారు. థియేటర్లను మూయనైనా మూసేస్తాం కానీ ప్రభుత్వ ఉత్తర్వులను అంగీకరించే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్తున్నారు. ఆన్లైన్ టికెట్ పోర్టల్స్ బుక్ మై షో, పే టీమ్ మూవీస్ వంటివి ఆయా సినిమాల ప్రదర్శనకు భారీ మొత్తంలో తమకు అడ్వాన్స్ రూపంలో ఇస్తుంటాయని, ఇప్పుడు మధ్యలో ప్రభుత్వం ఇలాంటి షరతులను విధిస్తే, ఆ సంస్థలు తమ నుండి అడ్వాన్స్ ను తిరిగి ఇవ్వమంటాయని, ఇప్పటికిప్పుడు అంత భారీ మొత్తాన్ని ఎక్కడ నుండి తీసుకురావాలని ఎక్జిబిటర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరి మారకుంటే, త్వరలోనే ఎక్జిబిటర్లు థియేటర్లను మూయడం ఖాయమే.