పీఎస్ఎల్వీ-సీ40ని విజయవంతంగా ప్రయోగించి, 31 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇస్రో సైంటిస్టులకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ లు అభినందనలు తెలిపారు. మరోవైపు ఇస్రోకి కొత్త ఛైర్మన్ గా రానున్న శివన్ మాట్లాడుతూ, కార్టోశాట్-2 విజయవంతం దేశానికి బహుమతి అని చెప్పారు. ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన ఇస్రో సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇస్రో అంటేనే కొత్త ఆవిష్కరణలకు కేంద్రమని అన్నారు. ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలను చేపట్టబోతున్నామని చెప్పారు. చంద్రయాన్-2, జీఎస్ఎల్వీ మార్క్-2 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, అద్భుతమైన విజయంతో కొత్త ఛైర్మన్ కు స్వాగతం పలికామని చెప్పారు.