రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో వంట నూనెలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో భారత్లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పలు చోట్ల వ్యాపారులు దొరికిందే సందు అని నూనె ప్యాకెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వంట నూనెలను ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారి శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. పాత స్టాక్ విషయంలో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించారు. మరోవైపు వంటనూనె విక్రయాల విషయంలో అక్రమాలకు పాల్పడినవారిపై బైండోవర్ కేసులు పెడతామని విజిలెన్స్ అధికారి శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. బ్లాక్ మార్కెటింగ్పై దాడులు కొనసాగుతాయని చెప్పారు. అక్రమాలపై ప్రజలు 9440906254 నంబర్కు వాట్సాప్ చేయవచ్చని సూచించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంటనూనె ధరలు పెరిగాయని.. సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ కంపెనీలు , దుకాణాలపై దాడులు చేశామని ఆయన వివరించారు. 1890 ప్రదేశాల్లో తనిఖీలు చేసి 59 కేసులు నమోదు చేశామన్నారు. 889 కేసులను లీగల్ మెట్రాలజీ అధికారులు నమోదు చేశారని పేర్కొన్నారు.