భారత అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక వచ్చేస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఐఎన్ఎస్ కిల్తాన్’ను నేడు విశాఖపట్టణంలోని డాక్యార్డ్లో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. ఈ నౌకకు సముద్రపు అడుగు భాగంలోఉన్న జలాంతర్గాములను గుర్తించే సామర్థ్యం ఉంది. 1971లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో ఐఎన్ఎస్ కిల్తాన్ ఎనలేని సేవలు అందించింది. అయితే దీనిని 1987లో డీకమిషన్ చేశారు. దేశానికి ఈ యాంటీ సబ్మెరైన్ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ తాజాగా ఈ యుద్ధ నౌకకు మళ్లీ అదే పేరు పెట్టినట్టు నౌకాదళ అధికారులు తెలిపారు.దీనిని పూర్తిగా కార్బన్ ఫైబర్ కంపోజిట్ మెటీరియల్ ఉపయోగించి తయారుచేశారు. సముద్రం అడుగున ఉన్న శత్రువుల జలాంతర్గాములను గుర్తించి తుత్తినియలు చేసే సామర్థ్యం ఐఎన్ఎస్ కిల్తాన్ సొంతం. అంతేకాదు శత్రుదేశ రాడార్లు ఈ నౌకను గుర్తించలేకపోవడంతో ఈ నౌకకు ఉన్న మరో ప్రత్యేకత. నౌక బరువు 3500 టన్నులు కాగా, పొడవు 109 మీటర్లు. గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఏకదాటిగా 3450 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు. అత్యవసర సమయంలో వినియోగించుకునేందుకు వీలుగా ఈ ఓడపై ఏఎస్డబ్ల్యూ హెలికాప్టర్ కూడా అందుబాటులో ఉంటుంది.