ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అమరావతి రాజధాని రైతులు చేస్తోన్న పాదయాత్రకు ఆయన మద్దతు తెలిపారు. ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి అని ఆయన అన్నారు. రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు తమ పార్టీ సంఘీభావం తెలుపుతోందని ప్రకటించారు. అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమేనని చెప్పారు.రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారంతా పాదయాత్రకు మద్దతు తెలపాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఇది పాదయాత్ర కాదని, ఏపీ పరిరక్షణ కోసం చేస్తోన్న యాత్ర అని, అమరావతి రాజధానిపై వైసీపీ అనేక అసత్య ప్రచారాలకు పాల్పడిందని చంద్రబాబు నాయుడు అన్నారు. అయినప్పటికీ రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన కొనియాడారు.