ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పలు అంశాలపై విజయసాయిరెడ్డి ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గత 29 నెలల పాలనలోనే గ్రామాల్లో స్పష్టమైన అభివృద్ధి కన్పించింది. రూ. 12, 510 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టారని చెప్పారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ ఇతర నిర్మాణాలతో గ్రామాలు కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వం 3 ప్రతిష్టాత్మక ఆక్వా ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోందని చెప్పారు. విశాఖ జిల్లాలో రూ. 36. 55 కోట్లతో ఆక్వాటిక్ క్వారంటైన్ కేంద్రం, గుంటూరు జిల్లాలో రూ. 23. 78 కోట్లతో పండుగప్ప పిల్లల హేచరీ, రూ. 14. 20 కోట్లతో పసుపు పీత పిల్లల హేచరీ ఏర్పాటు కాబోతున్నాయని వెల్లడించారు. ప్రజా సంక్షేమంపై పాలకులకు చిత్తశుద్ధి ఉంటే మంచి వ్యవస్థలు రూపుదిద్దుకుంటాయన్నారు. ప్రతిష్టత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పధకాలను ఇతర రాష్ట్రాలూ అనుసరిస్తున్నాయని చెప్పారు. రేషన్ డోర్ డెలివరీ విధానం మొన్న తమిళనాడు, నిన్న కర్ణాటక, నేడు కేరళ. రాష్ట్రాలు ఏపీ పధకాలను ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయని చెప్పారు. తిరుమల శ్రీవారి అభిషేకానికి గిరిజన సహకార సంస్థ సరఫరా చేసే తేనెను వినియోగించాలన్న నిర్ణయంతో ఏజెన్సీల్లో తేనె ఉత్పత్తి పెరిగుతుందని తద్వారా గిరిజనులకు ఉపాధి కల్పనతో పాటు గిరిజన సహకార సంఘం అభివృద్దికి తోడ్పాటు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనాదిగా నిరాదరణకు గురవుతున్న గిరిపుత్రులను గుండెల్లో పెట్టుకుంటోంది జగన్ గారి ప్రభుత్వమేనని ఆయన చెప్పారు.