చెన్నై: అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు చర్చలు ఆశాజనకంగా సాగి.. సీట్ల పందేరాలు కొలిక్కి రావడంతో సీఎం పళనిస్వామి (ఈపీఎస్), మాజీ సీఎం పన్నీర్ సేల్వం (ఓపీఎస్) నేతృత్వంలోని ఈ రెండు శిబిరాలు విలీనం దిశగా కదులుతున్నాయి. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన చేసేందుకు తగిన ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం విలీనంపై అధికారిక ప్రకటన వెలువడవచ్చునన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సోమవారం హుటాహుటిన చెన్నైకి బయలుదేరడం గమనార్హం. ముంబైలో ఉన్న ఆయన సోమవారం నాటి తన అపాయింట్మెంట్లనీ రద్దు చేసుకొని.. చెన్నై బయలుదేరారని గవర్నర్ పీఆర్వో తెలిపారు. అన్నాడీఎంకేలోని ఈపీఎస్-ఓపీఎస్ శిబిరాల విలీనం నేపథ్యంలోనే ఆయన తమిళనాడు వస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విలీన ప్రక్రియ జోరందుకున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నేతల అత్యవసర భేటీకి పళని పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం వేదికగా చిన్నమ్మ శశికళను పార్టీ నుంచి సాగనంపబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఈ చర్యల్ని అడ్డుకునే రీతిలో న్యాయ పోరాటానికి దినకరన్ కసరత్తుల్లో పడడంతో ఉత్కంఠ పెరిగింది.