తన హోటల్ లో భోజనం చేసి రూ.5 తక్కువ ఇచ్చాడని ఓ హోటల్ యజమాని, అతని కొడుకు ఓ వ్యక్తిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. హోటల్ బయటకి తీసుకొచ్చి రోడ్డుపై చితకబాదారు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి హోటల్ యజమానిని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. కియోంఝర్ జిల్లాకు చెందిన జితేంద్ర దేహురి అనే వ్యక్తి ఘసీపూర్లోని ‘మా’ హోటల్ కు వెళ్లి భోజనం చేశాడు. భోజనానికి రూ.45 చెల్లించాలని జితేంద్రకు హోటల్ యజమాని మధు సాహు చెప్పాడు. అయితే తనవద్ద రూ.40 మాత్రమే ఉన్నాయని, మళ్లీ వచ్చినప్పుడు మిగతా డబ్బులు ఇస్తానని జితేంద్ర చెప్పాడు. అయినా హోటల్ యజమాని రూ.45 ఇవ్వాలని పట్టుబట్టడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే అక్కడికి వచ్చిన తన కుమారుడితో కలిసి మధు సాహు.. జితేంద్ర దేహురిపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడు పోలీసు స్టేషన్కు వెళ్లి హోటల్ యజమానిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో పాలుపంచుకున్న హోటల్ యజమాని కొడుకు మైనర్ కావడంతో అతడిని వదిలేశారు.