పెళ్లై ఇద్దరు పిల్లలున్నా ఓ వివాహిత, పెళ్లై ఓ బాబు ఉన్న యువకుడు ఒకరికొకరు ఆకర్షితులై వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. వేర్వేరు కుటుంబాలు కావడంతో వారు కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చివరికి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం వెనిగండ్లలో ఆదివారం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. పాకాలపాడుకు చెందిన సంగేపు గోపి(30)కి వెనిగండ్లకు చెందిన ఓ యువతితో వివాహం కాగా, వారికి ఓ బాబు ఉన్నాడు. గోపి గుంటూరు శివారు ఆటోనగర్ లోని ఓ ఫర్నిచర్ షాప్ లో పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన శ్యామల అనే వివాహితకు గోపికి మధ్య ఏడేళ్ల క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్ల క్రితం పెద్ద మనుషులు ఈ ఇద్దరినీ మందలించారు. ఆ సమయంలో తీవ్ర మనస్తాపం చెందిన శ్యామల భర్త జూటూరి గోపి ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్యామల భర్త చనిపోయిన తర్వాత కూడా వీరి సంబంధం కొనసాగింది. దీంతో వారి కుటుంబాల్లో సమస్యలు వచ్చాయి. దీనికి పరిష్కారం చావేనని భావించిన గోపి, శ్యామల స్థానిక సాయిబాబా ఆలయం ఎదుట ఉన్న పొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అదే సమయంలో గోపికి బంధువులు ఫోన్ చేయడంతో వారికి ఈ విషయం తెలిసింది. వెంటనే గోపి బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే గోపి మృతిచెందాడు. శ్యామల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.