ఓ 90 ఏళ్ల వృద్దుడికి అతడి కూతుళ్లు రెండో పెళ్లి చేశారు. తండ్రి ఒంటరివాడైపోవడంతో 75 ఏళ్ల వృద్దురాలితో వివాహం జరిపించారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షఫీ అహ్మద్(90) అనే వ్యక్తి భార్య చాలాకాలం క్రితమే మరణించింది. వారికి ఐదుగురు కుమార్తెలున్నారు. అహ్మద్ చిరు వ్యాపారం చేస్తూ తన కూతుళ్ళకు వివాహాలు జరిపించాడు. ప్రస్తుతం వయసు మీదపడటంతో ఇంట్లోనే ఉంటున్నాడు. కుమార్తెలు అత్తగారింటికి వెళ్లిపోవడంతో అతడు ఒంటరివాడైపోయాడు. దీంతో అహ్మద్ కుమార్తెలు అతనికి మళ్లీ వివాహం చేయాలనుకున్నారు. 75 ఏళ్ల ఆయషా అనే వృద్ధురాలితో తండ్రికి వివాహం జరిపించారు. జీవితంలోని చివరి దశలో ఉన్న తమ తండ్రిని ఆమె జాగ్రత్తగా చూసుకుంటుందని వారికి వివాహం జరిపించినట్లు కూతుళ్లు తెలిపారు. ఏది ఏమైనా వృద్ధాప్యంలో తోడు ఆవశ్యకతను తెలుపుతూ ఒక్కటైన ఈ జంట పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.