గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు గాలిలోకి లేవడానికి గ్రహణం వీడడం లేదు. ఈనెల నుంచి మస్కట్కు విమాన సర్వీసులు ఆరంభం కావాల్సి ఉంది. వారంలో ఒకరోజు మంగళవారం అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఎయిరిండియా ముందుకొచ్చింది. ప్రతి మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి మస్కట్కు సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. విమాన షెడ్యూల్ను కూడా ప్రకటించింది. ఈనెల 20, 27న రెండు సర్వీసులు షెడ్యూల్లో పెట్టారు. తాజాగా ఈ రెండు సర్వీసులను రద్దు చేశారు. ప్రయాణికుల డిమాండ్ లేకపోవడం వల్లే ఈనెలలో వెళ్లాల్సిన సర్వీసులు ఆగిపోయాయి.
విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను ప్రకటించి నాలుగేళ్లు పూర్తయింది. అంతర్జాతీయ సర్వీసులు మాత్రం ఇక్కడి నుంచి నడవడం లేదు. తాజాగా దుబాయ్, మస్కట్కు సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు ముందుకొచ్చాయి. ముందుగా మస్కట్కు సర్వీసులను నడిపేందుకు ఎయిరిండియా అంగీకరించింది. విమానాశ్రయ అధికారులకు షెడ్యూల్ను కూడా అందజేశారు. కానీ. కొవిడ్ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఆంక్షలు కొనసాగుతుండడంతో. ఇటునుంచి వెళ్లే ప్రయాణికులు తక్కువగా ఉన్నారు. కేవలం ఆయా దేశాల్లో స్థిరపడిన, వీసాలున్న వారికి మాత్రమే అనుమతి ఉంది. దీనివల్లే ప్రస్తుతం ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాలు ఆరంభించినప్పటికీ. పెద్దగా డిమాండ్ ఉండడం లేదు. ఆగస్టు నెలలోనూ నాలుగు సర్వీసులను మస్కట్కు నడిపేందుకు షెడ్యూల్లో పెట్టారు. ఆగస్టు 3, 10, 17, 24వ తేదీల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులున్నాయి. ప్రయాణికుల డిమాండ్ను బట్టి. ఈ సర్వీసులు నడుస్తాయో. లేదో తేలుతుందని విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు.