కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఓ తండ్రి కన్నకూతురినే హతమార్చాడు. కూతురు గర్భవతి అని కూడా చూడకుండా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన జార్ఖండ్లోని ధన్బాద్లో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. జార్ఖండ్లోని ధన్బాద్ కు చెందిన రాంప్రసాద్ కూతురు ఖుష్బూ కుమారి (20) 9 నెలల క్రితం కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లిని అంగీకరించలేని తండ్రి తన కూతుర్ని ఎలాగైనా చంపాలనుకున్నాడు. భూమిని చూపిస్తాను రమ్మని కూతురిని నమ్మించాడు. 7 నెలల గర్భవతి అయిన ఖుష్బూ తండ్రితో పాటు తల్లి కూడా ఉండటంతో వారిని నమ్మింది. ఆటోలో వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లగానే పదునైన ఆయుధంతో కూతురి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను చూసి తల్లి పెద్దగా అరుస్తూ, సాయం కోసం ఏడుపు ప్రారంభించింది.
రాంప్రసాద్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగిందని గోవింద్పూర్ ఇన్స్పెక్టర్ సురేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.