తాత్కాలిక సుఖాల కోసం పచ్చని కాపురాల్లో చిచ్చులు పెట్టుకుంటున్నారు కొంత మంది. పరాయి వారి కోసం అయిన వారిని కడతేర్చుతున్నారు. తాజాగా ప్రియుడితో కలిసి భర్తకు దొరికిపోయిన ఓ భార్య అత్యంత క్రూరమైన నిర్ణయం తీసుకుంది. ఆమె నిర్ణయం పోలీసులనే షాక్ తినేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కోవూరు మండలం కొత్తూరుకు చెందిన రవీంద్ర పాస్టర్ గా పని చేస్తున్నాడు. అతడు ఐదు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుగొల్పే అంశాలు వెలుగు చూశాయి. అతడు రోడ్డు ప్రమాదంలో మరణించలేదని తేల్చారు పోలీసులు. రవీంద్ర మరణానికి అతడి భార్య వివాహేతర సంబంధమే కారణం అని దర్యాప్తులో వెల్లడైంది.
రవీంద్ర భార్య సమతకు అదే గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల వీరిద్దరు కలిసి ఉండగా రవీంద్ర చూశాడు. దీంతో తమ గుట్టు రట్టవడం ఖాయం అని భావించిన సమత తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తకు మరణ శాసనం లిఖించింది. ప్రియుడి సాయంతో భర్తను చంపేసింది. ఆపై రాము తన ఆటోలో మృతదేహాన్ని జాతీయ రహదారిపై పారేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. విచారణలో పోలీసులు నిజం నిగ్గు తేల్చారు. సమత ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను విచారించగా అసలు నిజం చెప్పేసింది. ప్రియుడు రాముతో కలిసి హత్య చేసినట్లు అంగీకరింది. దీంతో పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.