బలహీనవర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బలహీనవర్గాలకు న్యాయం చేస్తామని మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చాక బలహీనవర్గాలపై కక్ష కట్టారని విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిపై నాన్బెయిలబుల్ కేసు పెట్టారని, తీవ్రవాది మాదిరిగా మీడియా ముందు ప్రవేశపెట్టారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడునెలల కాలంలో ఒక్క పైసా కూడా బలహీనవర్గాలకు సీఎం జగన్ ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. అమ్మ ఒడి పథకం పేరుతో కొందరికే ప్రయోజనం చేకూర్చారని విమర్శించారు. బలహీనవర్గాలకు కేటాయించిన డబ్బులు అమ్మ ఒడికి మళ్లించారని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంతో ఎంతమంది లబ్ది పొందుతున్నారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.