టీ20 సిరీస్ అనంతరం న్యూజిలాండ్-భారత్ జట్లు మూడు వన్డేల సిరీస్కు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 5న హామిల్టన్లో తొలి మ్యాచ్ జరగనుంది. తొలి వన్డే మ్యాచ్ సందర్భంగా హామిల్టన్లో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. 'గాయంతో రోహిత్ శర్మ వన్డే సిరీస్కు దూరమవ్వడం దురదృష్టకరం. కోలుకుంటాడు అనుకున్నాం. కానీ అలా జరగలేదు. ఇది మాకు పెద్ద దెబ్బే. మ్యాచ్లో రోహిత్ ఎంత ప్రభావం చూపిస్తాడో అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం మాకు వన్డే సిరీస్లు ఎక్కువగా లేవు. రోహిత్ కోలుకోవడానికి ఇదే సరైన సమయం. రోహిత్ గాయంపై అలాంటి ఆందోళన లేదు' అని కోహ్లీ తెలిపారు. 'ఈ సిరీస్తో వన్డేల్లో ఓపెనర్గా పృథ్వీ షా అరంగ్రేటం చేయనున్నాడు. కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. ఎందుకంటే.. రాహుల్ మిడిల్లో అలవాటు పడాలని భావిస్తున్నాం. ఆసీస్ సిరీస్లో కూడా రాహుల్ మిడిల్లో బాగా ఆకట్టుకున్నాడు. పృథ్వీ షా ఎలా ఆడుతాడో చూడాలి. యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మయాంక్ అగర్వాల్కు కూడా మంచి అవకాశం దొరికింది' అని కోహ్లీ పేర్కొన్నారు. 'వన్డేల్లో ఇటీవల ఆసీస్తో గొప్పగా పోరాడాం. తొలి మ్యాచ్ ఓడినా తిరిగి పుంజుకొని వరుసగా రెండు మ్యాచులు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్నాం. ఈ విజయంతో మాలో మరింత విశ్వాసం పెరిగింది. ప్రణాళికలను అమలు చేస్తూ మంచి క్రికెట్ ఆడాలని భావిస్తున్నాం. వన్డే సిరీస్లో న్యూజిలాండ్ గట్టి పోటీనిస్తుందని తెలుసు. మా ప్రణాళికలు మాకున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో పటిష్టంగా ఉన్నాం. అత్యుత్తమంగా ఆడుతాం' అని కోహ్లీ అన్నారు. 'మేం ఫీల్డింగ్లో మరింత మెరుగవ్వాలి. గత సిరీస్లో (కివీస్ టీ20) పేలవంగా ఫీల్డింగ్ చేసినా.. టీ20ల్లో విజయం సాధించాం. కానీ.. వన్డేల్లో అలా కుదరదు, ఫలితాలు మారుతుంటాయి. మైదానంలో చురుకుగా ఉండటానికి ప్రయత్నిస్తాం. దీనిపై మరింత దృష్టిసారించాలి. మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాం. జట్టులో కుర్రాళ్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఫీల్డింగ్ విషయంలో త్వరగా నేర్చుకుంటారు' అని కోహ్లీ చెప్పుకొచ్చారు. రోహిత్ శర్మ గాయంతో జట్టుకు దూరమవ్వడంతో అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడని కోహ్లీ స్పష్టం చేయడంతో.. పృథ్వీ షాతో కలిసి మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ 5-0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
వన్డే జట్టు:మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), లోకేష్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్.